1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (15:20 IST)

ఉద్యోగం పేరుతో మహిళను తీసుకెళ్లి బిజినెస్‌మేన్‌కు విక్రయించిన ఘనుడు!

ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఘనుడు నమ్మించాడు. ఆతని మాయ మాటలు నమ్మి ఆ మహిళ వెంట వెళ్లింది. అయితే, కేటుగాడు మాత్రం ఆ మహిళ ఓ బిజినెస్‌మేన్‌కు విక్రయించాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని ధార్వాడ్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ధార్వాడ్ తాలూకాలోని ఉప్పిన్ బెటాగేరిలో నివసిస్తున్న ఒక మహిళ పేదరికంతో బాధపడుతూ వచ్చింది. ఇదే ప్రాంతంలోని అమీనాభవికి చెందిన దిలీప్‌ అనే వ్యక్తికి ధార్వాడ్ తాలూకాలోని కేసీ పార్క్ సమీపంలోని దుకాణంలో పనిచేస్తున్నప్పుడు మహిళతో పరిచయం ఏర్పడింది.
 
అమె సమస్యను గుర్తించిన దిలీప్‌ ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. బెంగళూరులో ఉద్యోగం పొందడానికి సహాయం చేస్తానని నిందితుడు మహిళకు హామీ ఇచ్చాడు. నిందితుడి ఉద్దేశాలను అనుమానించకుండా సదరు మహిళ అతనితో వెళ్లాలని నిర్ణయించుకుంది.
 
దిలీప్ ఆ మహిళను అహ్మదాబాద్‌కు తీసుకెళ్లి ఒక వ్యాపారవేత్త ఇంట్లో సహాయకురాలి పనికి కుదిర్చాడు. నెల రోజుల తర్వాత వ్యాపారవేత్త ఇంటికి వచ్చిన దిలీప్‌.. ఆ మహిళకు ఇంతకన్నా మంచి ఉద్యోగం ఉందని అక్కడ ఉద్యోగం మాన్పించి తనతో తీసుకెళ్లాడు. ఆ మహిళను గుజరాత్-రాజస్థాన్ సరిహద్దులోని పదన్‌పూర్‌కు తీసుకెళ్లి ఒక వ్యాపారవేత్తకు రూ.2 లక్షలకు విక్రయించాడు.
 
తనను విక్రయించినట్లు ఆ మహిళ తెలుసుకుని వ్యాపారి ఇంటి నుండి పారిపోయి అహ్మదాబాద్ చేరుకుంది. అక్కడ ఆమె గతంలో పనిచేసిన కుటుంబాన్ని సంప్రదించింది జరిగిన విషయాన్ని చెప్పింది. 
 
వారి సహాయంతో ఆ మహిళ తన ఇంటికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను గుర్తించారు. నిందితుడు దిలీప్‌ను గుజరాత్ నుంచి అరెస్ట్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.