గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (10:51 IST)

మాక్ వేగాన్ని మించిన ప్రయాణం.. సైన్యం చెంతకు సరికొత్త ఆయుధం 'అస్త్ర'

భారత సైన్యంలో సరికొత్త ఆయుధం వచ్చి చేరనుంది. అదీ కూడ మాక్ 4.5 వేగానికి నాలుగు రెట్లు అధిక వేగంతో ప్రయాణించే అస్త్ర వచ్చి చేరనుంది. ఈ ఆయుధాన్ని భారత రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ డీఆర్డీవో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ ఆయుధాన్ని భారత మిసైల్ చరిత్రలో ఇదో బ్రహ్మాస్త్రంగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అస్త్ర మిస్సైల్ పరీక్షను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. 
 
ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న అస్త్ర ఆయుధాన్ని త్వరలోనే భారత వాయుసేనకు అప్పగించనున్నారు. కంటికి కనిపించని దూరాల్లో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించడంలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లకు ఇది ధీటుగా నిలుస్తుంది. త్వరలోనే దీన్ని లాంగ్ రేంజ్ మిసైల్‌గా మలిచేందుకు డీఆర్‌డీవో కృషి చేస్తుందని డీఆర్‌డీవో చీఫ్ డాక్టర్ జి. సతీశ్ రెడ్డి వెల్లడించారు.
 
ఈ తరహా మిసైళ్లు ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అస్త్ర కారణంగా భారత్ కూడా ఆ దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అస్త్ర క్షిపణి మాక్ 4.5 వేగానికి నాలుగు రెట్లు అధికవేగంతో ప్రయాణించనుంది. అన్ని రకాల వాతావరణాల్లోనూ గురితప్పకుండా లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణులు భారత వాయుసేనలో సుఖోయ్, తేజాస్ విమానాలకు అతికినట్టు సరిపోతాయి. మార్గమధ్యంలో తప్పుదారి పట్టించేందుకు ప్రత్యర్థి యుద్ధవిమానాలు చేసే గిమ్మిక్కులను కూడా అస్త్ర సమర్థంగా ఎదుర్కొని తాను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేయనుంది.