శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:15 IST)

భార్యతో 3 రోజులు, ప్రేయసితో 3 రోజులు గడుపు, ఒక రోజు శెలవు తీసుకో: జార్ఖండ్ పోలీసులు

జార్ఖండ్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే... జార్ఖండ్ పోలీసులు ఒక వ్యక్తిని అతడి భార్యతో మూడు రోజులు, ప్రేయసితో మూడు రోజులు గడపాలని కోరారు. అంతేకాదు.. ఆ వ్యక్తికి ఒక రోజు సెలవు కూడా ఇచ్చారు.
 
వివరాల్లోకి వెళితే... రాంచీలోని కోకర్ తిరిల్ రోడ్‌లో నివసిస్తున్న రాజేష్ మహతో వివాహం చేసుకున్నప్పటికీ ఒక యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా తనకు పెళ్లి కాలేదని ఆమెతో అబద్ధం చెప్పాడు. అతడిని నమ్మిన ఆ యువతి అతడికి శారీరకంగా దగ్గరైంది. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందామని యువతి ఒత్తిడి చేయడంతో ఇక చేసేదేమీ లేక కట్టుకున్న భార్యాబిడ్డల్ని వదిలేసి ప్రేయసితో పారిపోవాలని ప్లాన్ వేసాడు.
 
ఇంతలో విషయం భార్యకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్ కోసం గాలింపు ప్రారంభించారు. ఈ లోపు ప్రేయసి తరపు పేరెంట్స్ కూడా తమ కుమార్తెను రాజేష్ అనే వివాహితుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడనీ, ఆమెను కిడ్నాప్ చేసాడని కేసు పెట్టారు. ఎట్టకేలకు రాజేష్, అతడి ప్రేయసితో పారిపోతున్న సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు.
 
స్టేషనుకు తీసుకురాగానే రాజేష్ భార్యా, ప్రియురాలు ఇద్దరూ బాహాబాహికి దిగారు. దాంతో పోలీసులు కలుగజేసుకుని రాజీ కుదిర్చారు. అదేమిటంటే... రాజేష్ 3 రోజుల పాటు భార్యాబిడ్డలతోనూ, మరో 3 రోజుల పాటు ప్రేయసితో గడపాలి. ఒక రోజు శెలవు తీసుకోవాలి. ఈ మేరకు సిద్ధం చేసిన అగ్రిమెంటుపై ఇరు కుటుంబ పెద్దలతో సంతకాలు కూడా చేయించారు.
 
ఆ ప్రకారం నడుస్తుండగా, రాజేష్ ప్రియురాలు మరో కేసు పెట్టింది. తన ప్రియుడు తనపై అత్యాచారం చేస్తున్నాడనీ, ఓ భార్యలో చూడటంలేదని ఫిర్యాదు చేసింది. ప్రియురాలు కేసు పెట్టిందని తెలుసుకున్న రాజేష్ పత్తా లేకుండా పారిపోయాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు మళ్లీ గాలింపు చేపట్టారు.