బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 జూన్ 2021 (08:35 IST)

కోడలిని రూ.80 వేలకు విక్రయించిన మామ... ఎక్కడ?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మామ తన కోడలిని 80 వేల రూపాయలకు విక్రయించాడు. ఈ విషయం తెలిసిన భర్త.. పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బారాబంకీ జిల్లాలోని మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ.80 వేలకు విక్రయించాడు. 
 
ఈ విషయం తెలిసిన బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని ముఠా చెర నుంచి విడిపించి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు అరెస్టు చేసిన 8 మంది నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్‌తోపాటు మరో నిందితుడైన రాము గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలి మామ చంద్రరామ్ ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. పలు వ్యసనాలకు బానిస అయిన చంద్రరామ్ డబ్బు కోసం కోడలిని అమ్మినట్టు భావిస్తున్నారు.