1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2023 (14:14 IST)

జీ-20 అప్డేట్స్- ప్రధాని ముందు "భారత్" నేమ్ ప్లేట్ (video)

Bharat
Bharat
జీ-20 సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు "భారత్" నేమ్ ప్లేట్ కనిపించింది. దీంతో ఇండియాను తొలగించి దేశం పేరును భారత్‌గా మార్చబోతున్నారనే వార్తలు నిజమేననే సంకేతం కనిపించింది. జీ20 విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపించిన లేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ప్రత్యేక సమావేశాల అజెండా గురించి ఇంకా ప్రకటించలేదు. అజెండా ఏంటో చెప్పాలని కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. 
 
మరోవైపు భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ దేశాధినేతలకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలుకుతున్నారు.
 
జీ20 సమావేశాల కోసం న్యూఢిల్లీ చేరుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేరుగా ప్రధానమంత్రి మోదీ నివాసానికి వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఆయనతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఇరువురు నేతలు కీలక అంశాలపై చర్చించారు.
 
జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ప్రత్యేక చొరవ చూపించింది. ఈ కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ ను సైతం భాగస్వామిని చేసింది. జీ20 దేశాల కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ ను శాశ్వత సభ్య దేశంగా చేర్చుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.