మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (16:33 IST)

గర్భిణిని నిల్చోబెట్టి పురుడు పోశారు... మోడీ రాష్ట్రంలోనే...

"బేటీ బచావో.. బేటీ పడావో" అంటూ గొప్పగా ప్రచారం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఓ గర్భిణి పట్ల ఆస్పత్రి వైద్యులు అమానుషంగా ప్రవర్తించారు. గర్భిణిని నిలబెట్టి పురుడు పోశాడు. ఈ ఘటన గత శుక్రవారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌ రాష్ట్రంలోని బనస్కాంథ జిల్లాలో రామి బెన్‌ గౌతంభాయ్‌ ఠాకూర్‌ అనే మహిళ డెలివరీ కోసం తన అత్తతో కలిసి జలోటా ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. 
 
ప్రసూతి గదిలోకి తీసుకెళ్లి పురుడు పోయాల్సిన నర్సు కాస్త.. రామి బెన్‌ను ఎదురుగా ఉన్న ఇనుప రాడ్డు పట్టుకొని నిల్చోమని చెప్పి అలానే పురుడు పోసింది. ప్రసవం అయిన తర్వాత బిడ్డ బయటకు వచ్చాక.. రామి బెన్‌ చీరతోనే నేల మీద పడ్డ రక్తాన్ని తుడిపించింది. ఈ విషయం తెలుసుకున్న రామి బెన్‌ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
అయితే ఇలా నిల్చోబెట్టి ప్రసవం చేయడం ఈ ఆరోగ్య కేంద్రంలో కొత్తేం కాదని.. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని ఇదే ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకున్న అనేక మంది మహిళలు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. తమ ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని సీనియర్‌ వైద్యుడొకరు తెలిపారు.