మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (14:10 IST)

భార్య - ఇద్దరు పిల్లలున్న ప్రియుడుతో కలిసివుండేందుకు అనుమతి

రాజస్థాన్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహం చేసుకుని భార్యాపిల్లలున్న వ్యక్తి మరో ప్రియురాలితో కలిసి ఉండొచ్చని రాజస్థాన్ కోర్టు స్పష్టం చేసింది. నిజానికి వివాహితుడు మరో మహిళ లేదా యువతితో ఉండటం అనేది చట్ట విరుద్దం. కానీ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిన యువతిని అతనితో కలిసి ఉండొచ్చు అంటూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ మేరకు రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 
 
మంగళవారం వెల్లడైన ఈ వివరాలను పరిశీలిస్తే, రూపాల్‌ సోనీ అనే మహిళ(26) మొయినుద్దీన్‌ అబ్బాసీ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2018, జూలై 23వ తేదీన రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోనీని ఇంట్లో బంధించారు. దాంతో మొయినుద్దీన్‌ తన భార్యను చూపించాలంటూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారణలో భాగంగా గత ఏడాది మార్చి 13న పోలీసులు సోనీని కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
 
మొయినుద్దీన్‌కు అప్పటికే వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తేలింది. అయినప్పటికీ అతను సోనీని ఇంటర్‌ ఫెయిత్‌(నమ్మకం) వివాహం చేసుకున్నాడని.. తర్వాత దాన్ని రిజిస్టర్‌ చేయించాడని విచారణలో వెల్లడైంది. ఆశ్యర్యపోయిన కోర్టు కేసుకున్న సున్నిత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సోనీని ఉదయ్‌పూర్లో ఉన్న ప్రభుత్వ మహిళా సంక్షేమ కేంద్రానికి పంపించింది. అనంతరం కోర్టు సోనీకి ఆమె భవిష్యత్తు గురించి.. తర్వాత ఎదుర్కొబోయే పరిణామాల గురించి కౌన్సిలింగ్‌ ఇప్పించింది. ఆపై తాజా విచారణలో భాగంగా కోర్టు సోనీ నిర్ణయం గురించి ప్రశ్నించింది. తాను మొయినుద్దీన్‌తోనే ఉంటానని తేల్చిచెప్పింది. 
 
దాంతో కోర్టు 'సదరు మహిళ మేజర్‌, పూర్తి మానసిక పరిపక్వత కలిగిన వ్యక్తి, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల కోర్టు ఆమె నిర్ణయాన్ని గౌరవించి మొయినుద్దీన్‌తో కలిసి ఉండేందుకు అనుమతిస్తూ తీర్పునిస్తున్ను'ట్లు పేర్కొంది.