1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (08:50 IST)

ఇంటి శుభకార్యానికి బంధువులను పిలవలేదని కన్నబిడ్డను కాల్చేసిన తండ్రి...

ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధువులందరినీ పిలవలేదన్న కారణంతో కన్నబిడ్డను ఓ కసాయి తండ్రి తుపాకీతో కాల్చిపారేశాడు. హర్యానా రాష్ట్రంలోని భివానీలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
భివానీ జిల్లాలోని సుధీవాస్ గ్రామానికి చెందిన తారాచంద్ అనే వ్యక్తి ఇంట్లో ఓ శుభకార్యాన్ని నిర్వహించేందుకు తలపెట్టారు. ఇందుకోసం చుట్టుపక్కలవారితో పాటు బంధువులను కూడా ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, బంధువులను పిలిచే  బాధ్యతలను తన కుమారుడు ధర్మేంద్రకు అప్పగించాడు. 
 
అతను కొంతమంది బంధువులను పిలిచి.. ఇంకొందరిని పిలవలేదు. ఈ విషయం తారాచంద్‌కు తెలిసి ఆగ్రహించి, వారిని కూడా పిలవాలని చెప్పాడు. కానీ, ధర్మేంద్ర వారిని పిలిచేందుకు ససేమిరా అన్నారు. వెంటనే ఆగ్రహోద్రుక్తుడైన తారాచంద్ తన తుపాకీ తీసి కుమారునిపై కాల్పులు జరిపాడు. 
 
ఫలితంగా అతను కుప్పకూలిపోవడంతో, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరిశీలించి, అప్పటికే మృతి చెందాడని తేల్చిచెప్పారు. దీంతో బంధువులు ధర్మేంద్ర మృతదేహాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తారాచంద్‌తో పాటు.. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.