1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (14:54 IST)

కర్నాల్ టోల్ ప్లాజా వద్ద మహిళపై అత్యాచారం...

హర్యానా రాష్ట్ర నగర శివారు ప్రాంతమైన కర్నాల్ టోల్ ప్లాజా వద్ద ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ఇద్దరు దుండగులు పాల్పడ్డారు. ఈ టోల్ ప్లాజా సమీపంలోని మరుగుదొడ్డికి బహిర్భూమికి వెళ్లగా ఈ దారుణం జరిగింది. మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన కీచకులు వెళ్తూ వెళ్తూ మరీ తమ మొబైల్ నంబర్లు ఇచ్చిమరీ వెళ్లారు. హర్యానాలోని కర్నాల్ జిల్లాలో ఫిబ్రవరి 16, ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది. 
 
పంజాబ్ పట్టణానికి చెందిన భార్యాభర్తలు తమ బంధువులను చూడటానికి పానిపట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఆదివారం రాత్రి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో తమ సన్నిహితుల నుంచి రూ.2 వేలు తీసుకోవడానికి  రాత్రి 11 గంటల సమయంలో కర్నల్‌ టోల్‌ ప్లాజా దగ్గర ఆగారు. 
 
ఈ క్రమంలో మహిళ(19) టాయ్‌లెట్ కోసం వెళ్లింది. స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇది గమనించి, ఆ మహిళను వెంబడించారు. మహిళ  టాయిలెట్‌లోంచి తిరిగి వస్తుండగా ఆమెను అడ్డగించి కత్తితో బెదిరించి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. 
 
అనంతరం మహిళను అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు. పరారవుతూ ఘటన ప్రాంతంలో వారి మొబైల్‌ నెంబర్లను మహిళకు ఇచ్చి వెళ్లారు. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డ బాధిత మహిళ భర్త దగ్గరికి వచ్చి.. తనకు జరిగిన ఘోరాన్ని చెప్పుకుని భోరున విలపించింది. 
 
దీనిపై మరుసటిరోజు ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు... వారిచ్చిన మొబైల్ ఫోన్ల ఆధారంగా కామాంధులను అరెస్టు చేశారు. ఈ కీచకుల్లో ఒకడు టోల్‌ ప్లాజా సెక్యూరిటీ గార్డు సోనూ కాగా, మరొకడు టోల్ ప్లాజా దగ్గర చిప్స్‌ అమ్ముకునే మేఘరాజ్‌‌గా గుర్తించారు.