టైగర్ మెమన్ను కలిశా.. పాక్ ఐఎస్ఐ సాయంతోనే ముంబై పేలుళ్లు!: మాజిద్
ముంబై వరుస బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు టైగర్ మెమన్ను కలిశానని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉస్మాన్ మాజిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష నేపథ్యంలో మాజిద్ మీడియాతో మాట్లాడుతూ.. 1993లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే టైగర్ మెమన్ను రెండు, మూడు సార్లు కలిశానని చెప్పుకొచ్చారు.
‘‘టైగర్ మెమన్కు నేనేమీ స్నేహితుడిని కాను. అతడే మా కార్యాలయానికి వచ్చి కలిసేవాడు. యాకూబ్ అరెస్ట్పై టైగర్ చాలా బాధపడేవాడు. అప్పటికే ముంబై పేలుళ్లు జరిగిపోయాయి. టైగర్ భారత మోస్ట్ వాంటెడ్ లిస్ట్లోకి ఎక్కాడు. ఎందుకు? ఎలా? చేశావని టైగర్ను అడిగాను. పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకారంతోనే ముంబై పేలుళ్లకు పాల్పడ్డానని టైగర్ చెప్పాడు’’ అని మాజిద్ చెప్పారు.
కాగా యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష అమలు చేసిన నేపథ్యంలో మాజిద్ ప్రకటన కలకలం సృష్టించింది. 2002కు ముందు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న మాజిద్ ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయారు. అనంతరం 2002లో ఉత్తర కాశ్మీర్లోని బాండిపురా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థికిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
నాటి ముఫ్తీ మహ్మద్ సయీద్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. ఆ తర్వాత 2008 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మాజిద్, గతేడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.