శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (11:57 IST)

బీబీసీ కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు.. ఉద్యోగులకు మెయిల్

bbc log
బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాల్లో రెండో రోజైన బుధవారం కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని పేర్కొంటూ ఇటీవల బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీన్ని భారత్‌లో ప్రసారంకాకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారులు మంగళవారం నుంచి సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైలలో ఉన్న కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తన ఉద్యోగులకు బీబీసీ ఈమెయిల్స్ పంపించింది. ఐటీ అధికారులకు ఉద్యోగులు సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. జీతం గురించి అడిగిన ప్రశ్నలకు బదులివ్వాలని, వ్యక్తిగత ఆదాయం గురించి స్పందించకుండా ఉండొచ్చని ఆ మెయిల్‌లో పేర్కొన్నట్లు సమాచారం. 
 
బ్రాడ్‌కాస్ట్ విభాగం వారు కార్యాలయాలకు రావాలని, మిగిలిన సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని చెప్పింది. అలాగే ఈ సర్వే గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించ వద్దని ఇదివరకే సిబ్బందికి సంస్థ స్పష్టంచేసింది. 
 
కాగా, గుజరాత్‌ అల్లర్లలో నరేంద్ర మోడీ హస్తం ఉందని "ఇండియా: ద మోడీ క్వశ్చన్‌" పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోడీకి క్లీన్‌చిట్‌ లభించాక ఇలా అభాండాలు వేయడమేమిటని భాజపా అభ్యంతరం తెలిపింది. 
 
దీనికి సంబంధించిన లింకుల్ని సామాజిక మాధ్యమాల్లో నిషేధించింది. ఈ క్రమంలోనే ఐటీ శాఖ మంగళవారం రంగంలోకి దిగింది. 2012 నుంచి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పరిశీలనను సోదాలు కాదు.. సర్వే అని ఐటీ విభాగం పేర్కొనడం గమనార్హం.