గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (10:43 IST)

రెండున్నరేళ్ళ వయసు.. చనిపోతూ.. ఐదుగురికి ప్రాణం పోశాడు.. ఎలా?

రెండున్నరేళ్ళ వయసులోనే తాను చనిపోతూ ఐదుగురి ప్రాణాలను కాపాడాడు ఓ చిన్నారి. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌లో సంజీవ్ ఓజా అనే వ్యక్తి తన భార్య, కొడుకు జాష్తో జీవిస్తున్నారు. ప్రతిరోజూలానే డిసెంబర్ 9న కూడా చిన్నారి జాష్ బాల్కనీలో ఆడుకుంటున్నాడు. అతడి తల్లి ఏదో పనిలో నిమగ్నమై ఉంది. ఇంతలో బాల్కనీలో ఆడుకుంటున్న జాష్ కిందపడిపోయాడు. 
 
పెద్ద శబ్ధం విని రక్తపు మడుగులో ఉన్న కొడుకును తీసుకుని వెంటనే ఆస్పత్రికి పరిగెత్తింది ఆ తల్లి. ఐదు రోజుల పాటు వైద్యులు జాష్‌కు చికిత్స అందించారు. కానీ ఫలితం లేకపోయింది. డిసెంబర్ 14న జాష్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. దీంతో జాష్ తల్లిదండ్రులకు షాక్ తప్పలేదు. అయితే ఈ సమయంలోనూ ఓజా దంపతులు గుండె రాయి చేసుకుని ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. 
 
తమ బిడ్డ అవయవాలతో ఇతరుల ప్రాణాలు కాపాడాలని అనుకున్నారు. తమ కొడుకు అవయవాలను ఇతరులకు డొనేట్ చేసేందుకు తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడంతో ఓజా ఊపిరితిత్తులు, గుండె, కళ్లు, కిడ్నీలు, కాలేయాన్ని అవసరం ఉన్న పేషంట్లకు వైద్యులు వెంటనే పంపించారు. ఓజా గుండె, ఊపిరితిత్తులను 3 గంటల వ్యవధిలోనే విమానం ద్వారా చెన్నైకి తరలించారు.  
 
ఓజా రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ 13 ఏళ్ల బాలికకు అమర్చగా.. మరో కిడ్నీ సూరత్‌కు చెందిన 17 ఏళ్ల మరో బాలికకు అందించారు. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగేళ్ల బిడ్డకు ఓజా ఊపిరితిత్తులను వినియోగించారు. నవ్వుతూ కళ్ళముందు తిరుగాడిన బిడ్డ చనిపోయాడన్న బాధలోనూ వారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అంటూ వైద్యులు ప్రశంసిస్తున్నారు.