1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 ఆగస్టు 2021 (09:39 IST)

పంద్రాగస్టు వేడుకలు : ఎర్రకోటపై 8వ సారి జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 8వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ ప్రజలకు స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
 
అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అజయ్‌భట్‌ స్వాగతం పలికారు. 
 
ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు. ఒలింపిక్స్​లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 
 
కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినవారు దేశానికే స్ఫూర్తి అంటూ అభినందించారు. ఇండియా బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య పోరాట యోధులను స్మరించుకున్నారు.