శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (12:15 IST)

బెర్లిన్ గోడే కూలిపోయింది... ఈ మూడు దేశాలు ఒక్కటికావా?

ఎంతో చరిత్ర కలిగిన బెర్లిన్ గోడే కూలిపోయింది. అలాంటపుడు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఒక్కటికావా? అంటూ ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ప్రశ్నించారు. ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన తెలిపారు. 
 
పాకిస్థాన్ ఓడరేవు పట్టణమైన కరాచీ కూడా భారత్‌లో కలిసిపోయే రోజు వస్తుందని బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై నవాబ్ మాలిక్ స్పందించారు. ఫడ్నవిస్ వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ కూడా భారత్‌లో విలీనం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆ ప్రయత్నాలంటూ జరిగితే తాము బీజేపీకి మద్దతు ఇస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 
 
అంతేకాకుండా, బెర్లిన్ గోడే కూలిందని, అలాంటిది పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్‌లు ఎందుకు కలవవని ప్రశ్నించారు. ఈ మూడింటినీ కలిపి ఒకే దేశంగా మార్చాలని కనుక బీజేపీ భావిస్తే అందుకు తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు. 
 
ఇకపోతే, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంఎసీ) ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామన్నారు. అయితే, ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉందన్నారు. తమ పార్టీ కోసం పనిచేసుకునే హక్కు ప్రతి పార్టీకి ఉంటుందన్నారు. ప్రతి పార్టీ అదే చేస్తుందన్నారు. తాము కూడా తమ పార్టీని బలోపేతం చేసుకుంటామని మాలిక్ అన్నారు.