శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 నవంబరు 2020 (12:31 IST)

తండ్రి ఆశయం కోసం.. తీవ్ర విషాదంలోనూ జట్టుతోనే సిరాజ్!

ఒకవైపు కన్నతండ్రి ఇకలేరనే వార్త. మరోవైపు జట్టు ప్రయోజనాలు. ఈ రెండింటిలో ఏ క్రికెటర్ అయినా చనిపోయిన తండ్రిని చివరిసారి చూసేందుకే మొగ్గు చూపుతారు. కానీ, యువ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ మాత్రం భారత క్రికెట్ జట్టు ప్రయోజనాలను కాపాడేందుకే మొగ్గుచూపారు. పైగా, తన తండ్రి చివరి ఆశయాన్ని నెరవేర్చేందుకు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. 
 
భారత యువ క్రికెటర్ సిరాజ్. ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్‌లో అదరగొట్టాడు. దీంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తండ్రి ఇకలేరనే వార్త ఆస్ట్రేలియాలో ఉన్న సిరాజ్‌కు తెలిసింది. సిరాజ్‌ తండ్రి మహ్మద్‌ గౌస్‌ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఇలాంటి సమయంలో కుటుంబసభ్యుల వద్ద సమయం గడిపేందుకు సిరాజ్‌ను స్వదేశానికి పిలిపించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సంసిద్ధమైంది. 
 
ఇదే అంశంపై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ, సిరాజ్ మాత్రం తన తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం జట్టుతో పాటు ఉండేందుకే మొగ్గు చూపాడని చెప్పాడు. 'ఈ విషయమై సిరాజ్‌తో బీసీసీఐ మాట్లాడింది. ఈ కష్టకాలంలో కుటుంబంతో ఉండేందుకు అతడికి అనుమతి ఇచ్చాం. అయితే సిరాజ్‌ టీమిండియా తరపున ఆడేందుకే మొగ్గు చూపాడు. ఈ గడ్డు పరిస్థితిలో అతడికి మేం మద్దతుగా నిలుస్తాం' అని షా వెల్లడించారు. 
 
అటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా సిరాజ్‌ను కొనియాడాడు. 'సిరాజ్‌ది అద్భుతమైన వ్యక్తిత్వం. జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితిని అధిగమిస్తాడని ఆశిస్తున్నా. ఈ టూర్‌లో అతడు విజయం సాధించాలి' అంటూ ట్వీట్ చేశారు.