మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (19:35 IST)

సరికొత్త మైలురాయికి చేరువలో విరాట్ కోహ్లీ... ఏంటది?

భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరు జట్ల మధ్య వన్డే, టీ20, టెస్ట్ సిరీస్ జరుగనుంది. అయితే, ఈ పర్యటనలో పలువురు భారత క్రికెటర్లు సరికొత్త రికార్డులు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు. ఈయన మరో 133 పరుగులు చేస్తే వన్డే అంతర్జాతీయ కెరీర్‌లో 12 వేల పరుగులు మైలురాయిని అందుకుంటారు. 
 
ఇప్ప‌టివ‌ర‌కు 239 ఇన్నింగ్స్‌లో విరాట్‌.. 11867 ప‌రుగులు చేశాడు. లెజెండ‌రీ బ్యాట్స్‌మ‌న్ స‌చిన్ టెండూల్క‌ర్ ఈ మైల్‌స్టోన్‌ను 300 ఇన్నింగ్స్‌లో అందుకోగా, పాంటింగ్ 314, సంగ్క‌ర 336, జ‌య‌సూర్య 379, జ‌య‌వ‌ర్దనే 399 ఇన్నింగ్స్ తీసుకున్నారు. ఆ లెక్క‌న స‌చిన్ రికార్డును కోహ్లి బ‌ద్ధ‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి. 
 
అలాగే, విరాట్ కోహ్లి ఒక్క సెంచ‌రీ చేస్తే.. ఆస్ట్రేలియాపై వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచరీల స‌చిన్ రికార్డును స‌మం చేస్తాడు. స‌చిన్ 70 ఇన్నింగ్స్‌లో 9 సెంచ‌రీలు చేయ‌గా.. కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు 38 ఇన్నింగ్స్‌లో 8 సెంచ‌రీలు చేయ‌డం విశేషం. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మ‌రో కోహ్లీ మ‌రో రెండు సెంచ‌రీలు చేస్తే.. పాంటింగ్ (71)ను వెన‌క్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తాడు. తొలి స్థానంలో స‌చిన్ (100 సెంచ‌రీలు) ఉన్న విషయం తెల్సిందే. ఈయన అటు టెస్టులు, ఇటు వన్డేల్లో కలిపి వంద సెంచరీలు బాదాడు. 
 
అలాగే, కేఎల్ రాహుల్ 6 ఇన్నింగ్స్‌లో 261 పరుగులు చేస్తే వ‌న్డేల్లో విరాట్ కోహ్లి క‌న్నా వేగంగా 1500 ప‌రుగుల మైలురాయిని అందుకున్న ప్లేయ‌ర్‌గా నిలుస్తాడు. యువ క్రికెటర్ య‌జువేంద్ర చాహ‌ల్ వ‌న్డేల్లో 100 వికెట్ల మైలురాయికి కేవ‌లం 9 వికెట్ల దూరంలో ఉన్నాడు. చాహ‌ల్ 51 ఇన్నింగ్స్‌లో 91 వికెట్లు తీశాడు. ఒక‌వేళ ఈ మూడు వ‌న్డేల సిరీస్‌లో 9 వికెట్లు తీసుకోగ‌లిగితే 55 మ్యాచుల్లోనే 100 వికెట్ల మైల్‌స్టోన్ అందుకొని అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త సాధించిన ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా నిలుస్తాడు.