1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్ మొగరాల
Last Modified: బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:49 IST)

ఇస్రో మరో ఘనత... జీశాట్ 31 సక్సెస్...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 31 ఏరియానా స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుండి విజయవంతంగా నింగిలోకి పంపింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.31 గంటలకు నింగిలోకి వెళ్లిన ఏరియానా రాకెట్ 42 నిమిషాల్లోనే నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 
 
విజయవంతంగా నింగిలోకి ఎగిరిన ఈ ఉపగ్రహం కమ్యూనికేషన్ సేవలను అందించనుంది. కాగా జీశాట్ 31తో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్-4 ఉపగ్రహాన్ని కూడా అందులో చేర్చారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేసారు. 2535 కిలోలు ఉన్న ఈ ఉపగ్రహం 15 ఏళ్ల పాటు నిరాటంకంగా సమాచార సేవలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 
అత్యంత సమర్థవంతమైన కేయూ బ్యాండ్ ప్రసార వ్యవస్థను కలిగి ఉన్న జీశాట్ 31 ఇస్రో సంప్రదాయ ఉపగ్రహాలైన ఇన్‌శాట్, జీశాట్‌లకు అత్యాధునిక రూపంగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఈ ఉపగ్రహం భారతీయ భూభాగాలు, ద్వీపాలతో పాటు అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం పరిసరాల సమాచారాన్ని అందిస్తుంది. ఇది వరకే భూస్థిర కక్ష్యలో గల ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఈ ఉపగ్రహం అదనపు సమాచార సేవలను అందించనుంది.