శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:53 IST)

ఈశాన్యంలో అశాంతి.. జపాన్ ప్రధాని టూర్ రద్దు.. మమత ఫైర్

పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత ఈశాన్య భారతావనిలో అశాంతి నెలకొంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాం రాష్ట్ర ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ఆదివారం భారత పర్యటనకు రావాల్సిన జపాన్ ప్రధాని షింజో అబే, తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని జపాన్‌కు చెందిన జిజి ప్రెస్ వెల్లడించింది.
 
ఆదివారం అసోంలోని గువాహటిలో షింజో అబే, నరేంద్ర మోడీ మధ్య చర్చలు జరగాల్సి వుంది. ఈ సమయంలో అసోంలో పరిస్థితులు అనుకూలంగా లేవని భావించిన అబే, ఇండియాకు రాకపోవచ్చని సమాచారం. ఎలాగైనా సదస్సును నిర్వహించేందుకు భారత, జపాన్ ప్రభుత్వాలు మార్గాన్వేషణ చేస్తున్నాయని తెలుస్తోంది.
 
కాగా, ఇప్పటికే భారత్‌కు రావాల్సిన బంగ్లాదేశ్ విదేశీ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, హోమ్ మంత్రి అసదుజ్జామన్ ఖాన్‌లు తమ మేఘాలయ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా అసోంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు, జపాన్ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దుచేసుకోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇది మన దేశానికే 'మాయని మచ్చ' అంటూ ఆమె దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) కారణంగా అసోంలో చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో అబే తన భారత పర్యటన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
అబే తన భారత పర్యటన వాయిదా వేసుకునే యోచనలో ఉన్నారంటూ ఇవాళ ఉదయమే జపాన్ మీడియా సంస్థ జీజీ ప్రెస్ వెల్లడించింది. మరికొద్ది సేపటికే ఈ పర్యటన రద్దు చేసుకునేందుకు భారత్, జపాన్ అంగీకరించాయని.. త్వరలోనే అనువైన మరో తేదీన ఈ పర్యటన పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.