1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (10:56 IST)

వెంకన్నా… నువ్వేం దేవుడవయ్యా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కోట్లాది మంది ఇష్టదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కోట్లాది మంది ఇష్టదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వెంకన్నా.. నువ్వేం దేవుడవయ్యా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. 
 
నిజానికి శ్రీవారు కోట్లాది మందికి ఆరాధ్యదైవం. ఆయనకు కానుకలు.. మొక్కుబడుల రూపంలో కోట్లాది రూపాలు దక్కుతున్నాయి. ఆయనపై ప్రేమతో నడిచొచ్చే భక్తుడు ఒకరైతే… ఆయన్ను దూరం నుంచే చూసి మురిసి పోయేవాడు మరొకరు. అంతలా ప్రపంచవ్యాప్తంగా భక్తులున్న దేవుడు … ఏడుకొండలవాడు. 
 
అలాంటి దేవుడిపై కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'తిరుమల వేంకటేశ్వరుడు కోటీశ్వరులకే దేవుడు. పేదవారు ఆయన్ను దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే. తన హుండీనే కాపాడుకోలేని ఆయన భక్తులనెలా కాపాడతాడు? తిరుమలేశుడికి శక్తులే ఉంటే ఆయనకు భద్రత ఎందుకు?' అంటూ ఆమె ప్రశ్నలు సంధించారు. ఇటీవల తిరుచ్చిలో జరిగిన ‘నాస్తిక సమాజం మహానాడు’లో కనిమొళి ఏడుకొండలవాడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
వెంకన్నపై కనిమొళి చేసిన వ్యాఖ్యలపై హిందూమక్కల్‌ కట్చి మండిపడింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఆమెను తక్షణం జాతీయ భద్రత చట్టం కింద అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.