శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (09:30 IST)

జయహో పాకిస్థాన్ అంటూ నినాదాలు.. మక్కెలిరగ్గొట్టి బొక్కలో తోసిన కర్ణాటక పోలీసులు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడిపై దేశంయావత్తూ ఒకేతాటిపైకి వచ్చింది. పాకిస్థాన్‌పై తగిన బుద్ధి చెప్పాలంటూ ప్రతి ఒక్కరూ నినందిస్తున్నారు. కాశ్మీర్‌లోని వేర్పాటువాదులకు ప్రభుత్వం కల్పిస్తూ వచ్చిన భద్రతను కూడా ప్రభుత్వం తొలగించింది. అలాగే పాకిస్థాన్‌ను అష్టదిగ్బంధనం చేసేలా ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తోంది. వెరసి పాకిస్థాన్ పీచమణిచేలా భారత్ వ్యూహాలు రచిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు సమర్థించింది. జయహో.. పాకిస్థాన్ అంటూ నినాదాలు చేసింది. ఆమె ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఉగ్రదాడి తర్వాత, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో 'పాకిస్థాన్‌కు జయహో' అంటూ పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ కావడంతో ఐపీ అడ్రస్ మూలంగా ఆమెను గుర్తించి అరెస్టు చేశారు.
 
ఆమె పేరు జిలేఖాబీ. బెళగావిలోని శివపురలో ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేస్తోంది. ఈమె పాకిస్థాన్‌కు అనుకూల పోస్టులు చేసింది. ఆమె ఇంటిని చుట్టుముట్టిన కొందరు హిందూ సంఘాల యువకులు, రాళ్లు రువ్వి, ఇంటిని తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జిలేఖాబీని, ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
దేశాన్ని అవమానించేలా ఆమె ప్రవర్తించారని కేసు నమోదు చేసిన పోలీసులు, స్థానిక న్యాయమూర్తి ముందు హాజరు పరచగా, ఆయన రిమాండ్ విధించారు. కాగా, పుల్వామా ఉగ్రదాడిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. బారాముల్లా జిల్లాకు చెందిన తాహీర్‌ లతీఫ్‌, కశ్మీరీ విద్యార్థి అబిద్‌ మాలిక్‌ తదితరులపై ఇవే తరహా ఆరోపణలతో అభియోగాలు నమోదయ్యాయి.