1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (12:35 IST)

అలిగిన తమ్ముడు... 434 మీటర్ల పొడవుతో లేఖ రాసిన అక్కడ!

letter
కేరళ రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సోదరుల దినోత్సవం రోజున తనకు శుభాకాంక్షలు చెప్పలేదన్న కోపంతో అక్కపై తమ్ముడు అలిగాడు. నిజానికి ఆ రోజు సోదరుల దినోత్సమని ఆ చిన్నారి అక్కకు తెలియదు. దీంతో ఆమె తమ్ముడికి శుభకాంక్షలు చెప్పలేదు. దీంతో తీవ్రంగా మథపడడ్డాడు. పైగా, అక్క తన తప్పును తెలుసుకుని తమ్ముడుకు ఫోన్ చేయగా అతను తీయలేదు కదా ఆమె నంబరును బ్లాక్ చేశాడు. చివరకు అక్కకు వచ్చిన ఆలోచన ఫలించింది. తమ్ముడిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ 434 మీటర్ల పొడవుతో ఉండే పేపరుపై లేఖ రాసింది. దీన్ని చూసిన తమ్ముడుకి అక్కపై ఉన్న కోపం పోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఒక్కటయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత మే 24వ తేదీన సోదరుల దినోత్సవం. అక్క కృష్ణప్రియ సోదరుడికి శుభాకాంక్షలు చెప్పలేదు. దీంతో అక్కపై తమ్ముడు కృష్ణ ప్రసాద్ కోపగించుకున్నాడు. ఇంజినీర్‌గా పనిచేస్తున్న కృష్ణ ప్రియకు విషయం ఆలస్యంగా అర్థమైంది. తప్పును సరిదిద్దుకుంటూ.. తమ్ముడంటే ఎంత ప్రేమో తెలియచేయాలని భావించింది. 
 
దీనిపై కృష్ణప్రియ మాట్లాడుతూ.. 'బ్రదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయా. దీంతో తమ్ముడు నాతో ఫోన్‌లో మాట్లాడడం మానేశాడు. వాట్సప్‌లో నా నంబరు బ్లాక్‌ చేశాడు. అందుకే లేఖ రాయాలని అనుకున్నా. ఎ4 సైజ్‌ కాగితాలపై రాయడం మొదలుపెట్టా. కానీ.. తమ్ముడికి నేను చెప్పాలనుకున్న విషయం రాసేందుకు అవి సరిపోవని అర్థమైంది.
 
ఇంకా పొడవైన పేపర్లు కొనాలని అనుకున్నా. మార్కెట్‌కు వెళ్లి అడిగితే.. అలాంటివి ఉండవన్నారు. బిల్లింగ్‌ రోల్స్‌ మాత్రమే ఉంటాయని చెప్పారు. 14 బిల్లింగ్‌ రోల్స్‌ కొని ఇంటికి తెచ్చా. మొత్తం లేఖ రాసేందుకు 12 గంటలు పట్టింది. చివరకు ఆ లేఖ 434 మీటర్ల పొడవు, 5 కేజీల బరువు ఉంది' అని తెలిపింది. 
 
అయితే, ఆమె శ్రమ వృథా పోలేదు. లేఖాస్త్రం ఫలించడంతో.. అక్కాతమ్ముళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. మరోవైపు, ఈ భారీ లేఖకు.. ప్రపంచంలోనే అతి పొడవైన లేఖగా గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కే అవకాశముంది. ఇందుకోసం కృష్ణప్రియ ఇప్పటికే గిన్నిస్‌ సంస్థకు దరఖాస్తు చేసింది.