1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (11:14 IST)

ఓ ప్రభూ.. మీ ఆదర్శ రాజ్యంలో గంగానది ఘోష వింటున్నారా?

దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళా కవి రాసిన కవిత్వం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని ఆమె గుజరాతీ భాషలో రాశారు. ఆ తర్వాత దేశంలోని అనేక మంది కవులు... ఆయా ప్రాంతీయ భాషల్లోని తర్జుమా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ కవిత్వం ఇపుడు వైరల్‌గా మారింది. 
 
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఫలితంగా దేశ ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. గంగానదీ ప్రవాహంలో శవాల కుప్పలు కనిపిస్తున్నాయి. ఈ నది ఒడ్డున కనిపిస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్కరినీ గుండెకోతకు గురిచేస్తున్నాయి. 
 
వీటిని చూసిన 1 ఏళ్ల పారుల్‌ ఖక్కర్‌ కవయిత్రి తన కన్నీటినే సిరాగా చేసుకొని ఆవేదననంతా అక్షరబద్ధం చేశారు. దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని కలం ఝళిపించారు. ఈ పరిస్థితులకు ప్రధాని మోడీయే కారణమని చెబుతూ ఆయన్ను 'రామరాజ్యాన్నేలుతున్న నగ్న చక్రవర్తి'గా అభివర్ణించారు.
 
పవిత్రమైన గంగానది శవాల కుప్పతొట్టిగా మారిందని గుర్తుచేస్తూ 'ఓ ప్రభూ.. మీ ఆదర్శ రాజ్యంలో గంగానది ఘోషను వింటున్నారా?' అని మోడీని ఆమె ప్రశ్నించారు. ఆ కవయిత్రి.. మోడీ పుట్టిన గడ్డ గుజరాత్‌ వాస్తవ్యురాలు.. పైగా 'రానున్న కాలంలో గుజరాత్‌ కవితాజగత్తుకు ప్రతిరూపం' అని ఒకప్పుడు సాక్షాత్తు బీజేపీ శ్రేణులు అభివర్ణించారు.
 
'శవవాహిని గంగ' శీర్షికతో గుజరాతీ భాషలో ఆమె 14 పంక్తులతో కూడిన కవితను రాశారు. దీన్ని ఈనెల 11న సోషల్‌ మీడియాలోని తన ఖాతాలో పోస్టు చేశారు. అయితే దేశంలోని ఔత్సాహిక కవులు.. ఆమె కవితను అస్సామీ, హిందీ, ఇంగ్లీషు, తమిళం, భోజ్‌పూరి, మలయాళం, బెంగాలీ భాషల్లో అనువదించి సోషల్‌ మీడియాలో పెట్టారు. 
 
'ఓ ప్రభూ.. ప్రతి ఇంట్లోనూ యముడు భీకర నృత్యం చేస్తున్నాడు. మా గాజులే కాదు.. గుండెలూ ముక్కలవుతున్నాయి' వంటి ఆవేదనా పూరితమైన లైన్లు కవితలో ఉన్నాయి. ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో మీడియా, విపక్షాలు.. మౌనపాత్ర పోషిస్తున్నాయని చురకలంటించారు.