గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 డిశెంబరు 2020 (16:03 IST)

మేజర్ల సహజీవన స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు : అలహాబాద్ హైకోర్టు

ఇటీవలి కాలంలో సహజీవనం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇపుడు సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక మేజర్ అయిన అబ్బాయి, అమ్మాయి కలిసి జీవించవచ్చని, అది వారి స్వేచ్ఛ అని, దాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. 
 
ఫరూఖాబాద్‌కు చెందిన కామినీ దేవి, అజయ్ కుమార్ అనే జంట సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికీ వారివారి కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ జంట వేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. 
 
తాము ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకుంటున్నామని కలిసి జీవిస్తున్నామని పిటిషన్‌లో కామిని పేర్కొంది. అయితే తమను తన తల్లిదండ్రులు వేధింపులకు గురిచేస్తున్నారని, వేరే అబ్బాయితో పెళ్లికి బలవంతం చేస్తున్నారంటూ కామినీ దేవి తన పిటిషన్‌లో తెలిపింది. 
 
ఈ వాదనలు ఆలకించిన ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగం ప్రసాధించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. మేజర్ అయిన ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించడమనేది వారి హక్కని పేర్కొంది. 
 
వారి స్వేచ్ఛను హరించడానికి వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ హక్కు లేదని పేర్కొంది. వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాశ్ పడియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.