శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (13:20 IST)

శశికళకే బలం.. పన్నీర్ సెల్వం-స్టాలిన్ భేటీ ఎందుకు..? ఓపీఎస్ సీఎం అవుతారా? లేదా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ద్వారా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పేలా లేదు. తమిళనాట చోటుచేసుకున్న రాజకీయం సంక్షోభానికి తెరపడేందుకు ఇంకా రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్లు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ద్వారా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పేలా లేదు. తమిళనాట చోటుచేసుకున్న రాజకీయం సంక్షోభానికి తెరపడేందుకు ఇంకా రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీర్ వెంట ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని.. మిగిలిన వారంతా చిన్నమ్మకు మద్దతు చేస్తున్నారని సమాచారం. అయితే పన్నీర్ మాత్రం తప్పకుండా బలపరీక్షలో తానే నెగ్గుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ప్రజల మద్దతు, కార్యకర్తల మద్దతు ఓపీఎస్‌కు ఉన్న తరుణంలో.. చిన్నమ్మ మీడియా ముందు తన ఎమ్మెల్యేల బలం ఎక్కువని చూపించింది. దీంతో పన్నీర్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువే వుందని సమాచారం. కానీ ప్రజలు మాత్రం పన్నీర్‌కే మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో, ఆన్ లైన్ సర్వేలో పన్నీరే గెలిచారు. మరి ఎమ్మెల్యేల బల పరీక్షలో పన్నీర్ పాస్ అవుతారో లేదో అనే దానిపై సోమ, మంగళవారాల్లో తేలిపోనుంది. 
 
ఇదిలా ఉంటే.. పన్నీరు సెల్వం సచివాలయ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సంక్షోభం తర్వాత ఇన్నాళ్లు ఆ ఛాయలకు కూడా వెళ్లని పన్నీరు సెల్వం ఇవాళ సెక్రటేరియట్‌లో పర్యటించారు. ఆయన ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్‌కు బయల్దేరిన సమయంలో అనుచరులు, కార్యకర్తలు ప్రార్థనలు చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో పన్నీరు సచివాలయానికి వెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
 
పన్నీరు సచివాలయానికి వెళ్లిన కొద్దిసేపటికే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కూడా సచివాలయానికి వెళ్లారు. దీంతో సెక్రటేరియట్ వేదికగా తమిళ రాజకీయం ఎలాంటి మలుపు తిరగబోతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే మొదటి నుంచి పన్నీరు వైపే మొగ్గుచూపుతుండటంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. సచివాలయంలో స్టాలిన్-పన్నీర్ భేటీ అవుతారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శశికళతో తనకు ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు రాజకీయ పరంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం పన్నీర్ ప్రతిపక్ష నేత అయిన స్టాలిన్‌తో భేటీ అవుతారని తెలుస్తోంది.