బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (10:13 IST)

మాస్క్ పెట్టుకోలేదని ఖాకీల క్రౌర్యం... వామ్మో వీడియో చూస్తే...

ముఖానికి మాస్క్ పెట్టుకోలేదన్న కోపంతో ఓ ఆటో డ్రైవర్‌పై ఇద్దరు పోలీసులు అత్యంత హేయంగా ప్రవర్తించారు. తమ ప్రతాపాన్ని వారిపై చూపించారు. బుటుకాలితో ముఖంపై తన్నారు. ఇద్దరు పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌పై తమ క్రౌర్యం ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. యేడాది కాలంగా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఇదేక్రమంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి చేసింది. 
 
ఇందులోభాగంగా ఇటువంటి నిబంధనలను పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఇద్దరు పోలీసులు విచక్షణ కోల్పోయి ఓ ఆటో డ్రైవర్‌పై తమ ప్రతాపం చూపారు. మాస్క్ సరిగా ధరించలేదని నడిరోడ్డుపై చితకబాదారు. ఈ ఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
మాస్క్ సరిగా పెట్టుకోని ఒక ఆటో డ్రైవర్‌ను కిందపడేసి అతి దారుణంగా చితకబాదారు. ఆటో డ్రైవర్ కృష్ణ కెయర్(35) అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఈ సమయంలో అతను మాస్క్ సరిగా పెట్టుకోలేదు. దీనిని గమనించిన ఇద్దరు పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌ను ఆపి, పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, ఆటో డ్రైవర్ అందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌పై దాడికి దిగారు. అందరు చూస్తుండగానే ఆ వ్యక్తి కిందపడేసి చావబాదారు.
 
ఇదంతా గమనించిన అక్కడున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో పోలీసులు ఆటో‌డ్రైవర్‌పై దాడికి దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించారు.