శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (10:37 IST)

రియల్ 'శుభలగ్నం' : భర్తను ప్రియురాలికి అమ్మేసిన భార్య

తెలుగులో హీరో జగపతిబాబు - రోజా నటించిన చిత్రం "శుభలగ్నం". ఈ చిత్రంలో హీరోయిన్‌కు అమితమైన డబ్బు పిచ్చి. దీంతో ఆమె తన భర్తను కోటి రూపాయలకు మరో యువతికి విక్రయిస్తుంది. ఇపుడు అచ్చం ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. డబ్బుపై మోజుతో కట్టుకున్న ఓ భార్య తన భర్తను ఏకంగా అతని ప్రియురాలికి రూ.15 కోట్లకు అమ్మేసింది. ఇదో ముక్కోణపు ప్రేమకథ. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ బాలిక భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, ఓ పిటిషన్ దాఖలు చేసింది. అందులో తన తండ్రి ఓ మహిళతో వివాహేతర బంధం పెట్టుకుని, ఇంట్లో ప్రశాంతత లేకుండా చేశాడని, తరచూ తల్లితో గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారిద్దరి గొడవలతో తనకు, తన చెల్లెలికి చదువుపై ఆసక్తి ఉండటం లేదని వాపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్‌కు పిలిపించగా, అతని వివాహేతరబంధం నిజమేనని తేలింది. 
 
అయితే, అతను ప్రియురాలితోనే ఉండాలని భావిస్తున్నట్టు చెప్పాడు. విడాకులు ఇచ్చేందుకు తొలుత అంగీకరించని భార్య, చివరకు తన బిడ్డల భవిష్యత్తు కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇల్లు, పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని కోరగా, అందుకు భర్త ప్రియురాలు అంగీకరించింది. తన భర్త ప్రవర్తన నచ్చలేదని, బిడ్డల కోసమే విడాకులు ఇచ్చేందుకు అంగీకరిస్తున్న తెలిపింది. ఇందుకోసం భర్త కావాలంటే తనకు 15 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరింది. ఇందుకు ఆయన్ను ప్రేమించిన ప్రియురాలు సమ్మతం తెలిపింది. దీంతో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సుఖాంతమైంది.