బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (11:49 IST)

మమతకు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. ధన్యవాదాలు తెలిపిన దీదీ..

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి చుక్కెదురైంది. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. బెంగాల్‌లో సీఎం మమత బెనర్జీ ఆదివారం చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. ఈ ప్రకటన ద్వారా మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ... సీబీఐ విచారణకు కోల్‌కతా సీపీ రాజీవ్ కుమార్ సీబీఐ ముందు హాజరు కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ స్కాం కేసుల్లో ఆధారాలు మాయం చేశారని సీపీపై సీబీఐ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి నిరూపించుకునేందుకు హాజరవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తునకు ఎందుకు సహకరించట్లేదో తెలపాలని కోల్‌కతా పోలీసులు, డీజీపీ, బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ కేసులో సీపీని అరెస్టు చేయొద్దనీ, వేధింపులకు పాల్పడవద్దనీ సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 
 
కాగా సుప్రీంకోర్టు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందిస్తూ.. అత్యున్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. నైతిక విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. సీబీఐ విచారణకు సీపీ పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. సీబీఐ దర్యాప్తును తాము ఎప్పుడూ అడ్డుకోలేదన్న ఆమె... ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు. మోదీ, అమిత్‌ షా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారారన్న ఆమె... సీబీఐ వ్యవహరించిన తీరుపైనే తాము అభ్యంతరం చెబుతున్నామని వెల్లడించారు. తమ యుద్ధం మోదీ ప్రభుత్వంపైనేనని మమత వివరణ ఇచ్చారు.