1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (17:42 IST)

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. గృహాలకు నిప్పు

manipur
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. దీంతో దుండగులు అనేక గృహాలకు నిప్పు పెట్టారు. గత నెలలలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగిన విషయం తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా బలగాల మోహరింపు, పెట్రోలింగ్ వంటి చర్యలతో ఇన్నిరోజులు నివురుగప్పిన నిప్పులా ఉంది. 
 
తాజాగా స్థలం విషయంలో మెయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. రాజధాని ఇంఫాల్‌లోని న్యూ చెకాన్‌ ప్రాంతంలో పలు ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దాంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. భద్రతా బలగాలను మోహరించింది. 
 
మంటలు అంటుకున్న ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభించింది. హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 
 
మణిపుర్‌‌లో ప్రస్తుతం చెలరేగిన అల్లర్లకు మూలం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణం. రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల(ఎస్టీ) హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గిరిజన సంస్థలు ఆందోళనలను ఉద్ధృతం చేశాయి. 
 
అవి నిర్వహించిన సంఘీభావయాత్ర హింసాత్మక ఘటనలకు దారితీసింది. కొన్నిరోజుల పాటు రాష్ట్రం మండిపోయింది. ఆ ఘటనల్లో దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ, పారామిలిటరీ, పోలీసులను మోహరించి, కొద్దిరోజుల తర్వాత పరిస్థితిని అదుపులోకి తేగలిగారు. కానీ మళ్లీ అక్కడి వాతావరణం మొదటికొచ్చేలా కనిపిస్తోంది.