1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (12:54 IST)

అదనపు సమయం ఇవ్వలేదనీ ... పరీక్షా హాలును ధ్వంసం చేసిన విద్యార్థులు.. ఎక్కడ?

class room
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. బోర్డు పరీక్షలో తమకు అదనపు సమయం కేటాయించలేదని వారు పరీక్షా హాలును ధ్వంసం చేశారు. అంతటితో ఆగని వారు పరీక్షా కేంద్రానికి నిప్పు పెట్టారు. తమ పరీక్షా ఇంకా పూర్తి కాలేదని, అందువల్ల అదనపు సమయం ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దీనికి ఇన్విజిలేటర్ అంగీకరించలేదు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు... పరీక్షా కేంద్రాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మణిపూర్ రాష్ట్రంలోని తౌబాల్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తౌబాల్ జిల్లా యైరిపోక్‌లోని ఏసీఎం హైయ్యర్ సెకండరీ పాఠశాలలో శనివారం 12వ తరగతి మణిపురి లాంగ్వేజ్ బోర్డు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాన్ని ఎంసీఎం పాఠశాలలో ఏర్పాటుచేశారు. మొత్తం 405 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. వారిలో కొందరు తమకు పరీక్ష రాయడానికి మరికొంత సమయం కావాలని ఇన్విజిలేటర‌ను కోరాగా ఆయన అందుకు నిరాకరించారు. 
 
నిర్ణీత సమయం ప్రకారం వార్నింగ్ బెల్ మోగింది. ఆ తర్వాత పరీక్షా సమయం మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా విద్యార్థులంతా ఏకమై ఇన్విజిలేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరీక్షా హాలును ధ్వంసం చేశారు. పాఠశాలలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమలో ఓ టీచర్‌తో సహా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.