శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2022 (18:07 IST)

మణిపూర్‌లో ఘోరం... బస్సు బోల్తా 15 మంది విద్యార్థుల మృతి

manipur bus accident
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనతో ఆ ప్రదేశంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. చనిపోయిన వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. మణిపూర్ రాష్ట్రంలోని నోనె జిల్లా లంగ్సాయి తుబంగ్ శివారులో ఈ ప్రమాదం జరిగింది. స్టడీ టూర్ కోసం ఇంఫాల్ నుంచి ఈ బస్సు బయలుదేరి లంగ్సాయి తుబంగ్ వద్ద బోల్తాపడింది. 
 
ఈ విద్యార్థులంతా యారిపోక్‌లోని తంబాల్ను హైయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు. ఎడ్యుకేషన్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మణిపూర్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.