ముంబైలో అమానుషం.. వాచ్మెన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకేసిన శునకం..
ముంబై మహానగరంలో ఓ అమానుష ఘటన జరిగింది. వాచ్మెన్ దెబ్బలు భరించలేక ఓ శునకం 17వ అంతస్తు నుంచి దూకేసింది. దీంతో ఆ శునకం ప్రాణాలు కోల్పోయింది. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియను చూసిన జంతు ప్రేమికులు ఆ వాచ్మెన్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కర్రతో కుక్కను దారుణంగా కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దెబ్బలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన శునకం చివరకు 17వ అంతస్తున్న బాల్కనీ పైనుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ వీడియోను జంతు హక్కుల కార్యకర్త విజయ్ రంగారే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ భవన వాచ్మెన్ ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కానీ అది సరిపోదని నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే, నెటిజన్లు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దయచేసి కఠిన చర్యలు తీసుకోండి. ఆ మూగజీవి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించింది, కానీ, దానివల్ల కాక భవనంపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది అని ఒక యూజర్ కామెంట్ చేశారు.