శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (13:34 IST)

పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి అక్కర్లేదు : ఢిల్లీ హైకోర్టు

delhi high court
యుక్తవయస్సుకు వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలు తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బిహార్‌లో ఓ యువ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే, బంధువుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
పెళ్లి చేసుకున్న జంటను ఎవరూ విడదీయలేరన్నారు. పైగా, యుక్త వయస్సుకు వచ్చిన అమ్మాయిలు తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవచ్చని, అందువల్ల ఈ జంటకు రక్షణ కల్పించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ముఖ్యంగా, పెళ్లీడుకు వచ్చిన ముస్లిం అమ్మాయిలు తల్లిదండ్రుల అనుమతి లేకుండానే వివాహం చేసుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. 
 
బిహార్‌లో ఓ ముస్లిం యువ జంట పెళ్లి చేసుకుంది. తమ తమ మత సంప్రదాయాలకు అనుగుణంగానే వారిద్దరూ ఒక్కటయ్యారు. అయితే, తన తరపు బంధువు నుంచి ముప్పు ఉందంటూ ఆ అమ్మాయి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ జస్మీత్ సింగ్ ధర్మాసనం స్పందిస్తూ, చట్టబద్ధందా, సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న జంటను ఒకరి నుంచి మరొకరిని వేరు చేయలేరని స్పష్టం చేసింది. కలిసి ఉండటమే పెళ్లి యొక్క పరమార్థమని వ్యాఖ్యానించింది. 
 
మహమ్మదీయుల చట్టం ప్రకారం ఓ అమ్మాయికి యుక్త వయసు వస్తే తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకోవచ్చని సుస్పష్టం. 18 యేళ్ల లోపు వయస్సున్నప్పటికీ భర్తతో కలిసి నివసించే హక్కు ఆమెకు ఉంటుంది" అని ధర్మాసనం స్పష్టం చేసింది. అందువల్ల బిహార్ యువ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది.