శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (13:56 IST)

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ - యశ్వంత్‌కు 'జడ్' కేటగిరీ భద్రత

murmu nomination
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగుతున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వంటి హేమాహేమీలు ఆమె వెంట రాగా తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. దానికి ముందు ఆమె పార్లమెంట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌, బిర్సా ముండా విగ్రహాల వద్ద నివాళులు అర్పించారు.
 
రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మూ పేరును మొదట ప్రధాని ప్రతిపాదించగా.. ఆమె పేరును ప్రతిపాదిస్తూ 50 మంది ఎలక్టోరల్ కాలేజ్‌ సభ్యులు సంతకాలు చేశారు. ఎన్డీఏ ఎంపీలు, భాజపా రాష్ట్రాల సీఎంలు, మరో 50 మంది ఎంపీలు ఆమెను బలపరిచారు. వీరిలో వైకాపా తరఫున ఎంపీలు, విజయ్‌సాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి కూడా ఉన్నారు.
 
ముర్మూ అభ్యర్థిత్వం కోసం భాజపా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసింది. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రాజనాథ్‌ సింగ్, అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వాటిపై సంతకాలు పెట్టారు. ఇక నామినేషన్ సమయంలో వీరితో పాటు భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
 
మరోవైపు, యశ్వంత్‌ సిన్హాకు ‘జడ్‌’ భద్రత..
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేంద్రం ‘జడ్’ కేటగిరి భద్రతను కల్పించింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఆయనకు రక్షణగా ఉండనున్నారు. ముర్మూకు ఇప్పటికే కేంద్రం జడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, సిన్హా ఈ నెల 27 నామినేషన్‌ వేయనున్నట్టు సమాచారం. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా.. జులై 21న ఫలితాలు వెలువడనున్నాయి.