1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (18:22 IST)

కరోనా నిర్ధారణకు కొత్త విధానం

కరోనా నిర్ధారణ కోసం హైదరాబాద్ శాస్త్రవేత్తలు కొత్త పరీక్షా విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.300 ఖర్చుతో అరగంటలోనే ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిమ్స్‌, ఈఎస్‌ఐ శాస్త్రవేత్తలు కలిసి సంయుక్తంగా కొత్త వైద్య పరీక్షలకు రూపకల్పన చేశాయి. అయితే ఐసిఎంఆర్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ రోజు హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కొత్త వైద్య పరీక్ష విధానంలో కరోనా పరీక్ష చేయించుకున్నారని తెలిపారు. ఈ పరీక్షలో ఆయనకు నెగటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
 
లాక్‌డౌన్‌ విజయవంతమైనా...?
లాక్‌డౌన్‌ విజయవంతమైనా కరోనా వైరస్‌ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించడంలో మాత్రం విఫలమైందని ఎయిమ్స్‌ డైరెక్ట్రర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. అలాగే కరోనా వైరస్‌ కేసుల సంఖ్య కూడా ఇంకా వేగవంతం కాలేదని అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో భిన్న సమయాల్లో ఈ మహమ్మారి వేగవంతం కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా కేసుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు.

మన జనాభా అధికంగా ఉండటంతో యూరప్‌ దేశాలతో పోల్చలేమని, యూరప్‌లో రెండు మూడు దేశాల జనాభాను కలిపినా మన దేశ జనాభాకు సమానం కాదని అన్నారు. ఆయా దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని వివరించారు.