1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (15:27 IST)

కరోనాకు ఆజ్యం పోస్తున్న బాణాసంచా.. కొనొద్దు - కాల్చొద్దంటూ ఎన్జీటీ ఆదేశం

జాతీయ హరిత బోర్డు (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కీలక నిర్ణయం తీసుకుంది. బాణాసంచాపై ఉక్కుపాదం మోపింది. దేశ వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్పులపై నిషేధం విధిస్తున్నట్టు ఎన్జీటీ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అంటే గాలి నాణ్యత ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో ఈ బాణాసంచాను కాల్చొద్దంటూ ఆదేశాల్లో పేర్కొంది. 
 
ఓ వైపు కోవిడ్-19 మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే మరోవైపు బాణాసంచా దానికి ఆజ్యం పోస్తోందని ఈ సందర్భంగా ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. కోవిడ్-19 మహమ్మారి పోయేంత వరకు బాణాసంచా కాల్పులపై నిషేధం ఉంటుందని ఎన్‌జీటీ స్పష్టం చేసింది.
 
కాగా, ఇటీవల దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున బాణాసంచాకాల్చారు. కోవిడ్-19 ప్రభావానికి అతలాకుతలమై కాస్తంత కోలుకున్న ఢిల్లీకి ఇది పునర్‌విపత్తుగా పరిణమించింది. 
 
అసలే కాలుష్య కోరల్లో చిక్కుకునివున్న హస్తినకు.. ఈ బాణాసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగిపోయింది. పైగా, వైరస్ వ్యాప్తి పెరిగి కోవిడ్ కేసులు మళ్లీ విజృంభించాయి. బాణాసంచా కాల్పులపై సుప్రీంకోర్టు రెండు గంటల సమయమే ఇచ్చినప్పటికీ కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగింది.
 
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎన్జీటీ... నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో పాటు దేశంలో కరోనా ప్రభావం ఉన్న అన్ని నగరాలు, పట్టణాలతో పాటు కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో బాణాసంచా అమ్మకం, కాల్పులపై కోవిడ్ ప్రభావం తగ్గే వరకు నిషేధం విధించారు.