1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:32 IST)

లష్కరే తోయిబా హిట్ లిస్టులో విరాట్ కోహ్లీ, మోదీ, నిర్మలా సీతారామన్!

పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హిట్ లిస్టులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, భారత క్రికెట్ టీమ్ విరాట్ కోహ్లీలతో పాటు పలువురు దిగ్గజ నేతలు వున్నారు. 2008 ముంబై దాడులు సహా పలు ఉగ్రదాడులకు లష్కరే తోయిబా పాల్పడిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా లష్కరే తోయిబాగా పేరు మార్చుకున్న ఈ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా తమ టార్గెట్‌ జాబితాలో హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను చేర్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం భారత్‌కు ప్రత్యేకంగా ఈ ఉగ్రసంస్థను నెలకొల్పిన లష్కరే ప్రముఖలను టార్గెట్‌ చేయడం ద్వారా ఉగ్రవాదులను సైన్యం హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు నిఘా వర్గాల అంచనా. ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌తో కూడిన లేఖను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అందుకుంది. 
 
కానీ ఎన్‌ఐఏ వర్గాలు ఈ లేఖను బీసీసీఐకి పంపడంతో ఢిల్లీ పోలీసులు టీం ఇండియా సభ్యులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా బెదిరింపు లేఖ నకిలీదని ఎన్‌ఐఏ వర్గాలు భావిస్తున్నా పాక్‌ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న క్రమంలో రిస్క్‌కు తావివ్వకుండా భద్రతను ముమ్మరం చేయాలని అధికారులు రంగంలోకి దిగుతున్నారు.