1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 29 జనవరి 2020 (15:37 IST)

నిర్భయ దోషుల ఉరి అమలుకు లైన్ క్లియర్- ఫిబ్రవరి 1 ఉరి ఖాయం

నిర్భయ.. గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసులో క్షమాభిక్ష తిరస్కరణపై ముఖేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. తన క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి తన మనసు పెట్టి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. 

ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రకటించిన తీర్పులతో సహా అన్ని సంబంధిత విషయాలను రాష్ట్రపతి ముందు ఉంచినట్లు ధర్మాసనం తెలిపింది. ముఖేష్ వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి 1 ముఖేష్ ఉరి ఖాయంగా కనిపిస్తుంది.
 
జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నిన్న ముఖేష్ పిటిషన్‌ను విచారించింది. ముకేశ్ తరపున సీనియర్ లాయర్ అంజనా ప్రకాశ్ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. తీహార్ జైల్లో ముఖేశ్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేశారని అంజనా ప్రకాశ్ కోర్టుకు తెలిపారు. 
 
క్షమాభిక్ష అభ్యర్థన పెట్టిన సమయంలో దోషికి సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్రపతి ముందు పెట్టాలి… కానీ అధికారులు అలా చేయలేదని ఆమె కోర్టుకు తెలిపారు. అందువల్లే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారని ఆమె ఆరోపించారు. తీహార్ జైల్లో ముఖేశ్‌ను తీవ్రంగా కొట్టారని అంజనా ప్రకాశ్ అన్నారు. అంజనా ప్రకాశ్ చేసిన ఆరోపణలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తిప్పికొట్టారు. 
 
జైల్లో దోషి పడిన బాధను క్షమాభిక్ష కింద పరిగణనలోకి తీసుకోరని ఆయన అన్నారు. ముఖేశ్ ఒక్కడినే ఒక సెల్‌లో ఎక్కువ కాలం ఉంచలేదని.. కొన్ని రోజుల పాటు మాత్రమే వేరే సెల్‌లో పెట్టారని తెలిపారు. కొన్ని కేసుల్లో ఉరిశిక్ష పడిన దోషుల మానసిక పరిస్థితి క్షీణిస్తే వారికి మరణశిక్ష వెంటనే అమలు చేయడం కుదరదన్నారు. కానీ, ఈ కేసులో ఉరి శిక్ష పడిన ముఖేశ్ మానసిక పరిస్థితి చాలా బాగుందని తుషార్ మెహతా అన్నారు.