1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (09:24 IST)

ఇకపై ప్రయాణించిన దూరానికే టోల్‌చార్జీలు... నితిన్ గడ్కరీ

దేశ వ్యాప్తంగా జీపీఎప్‌ ఆధారంగా వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుసువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు పడతాయని చెప్పుకొచ్చారు. 
 
కాగా, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశంలోని అన్ని టోల్‌గేట్‌ల వద్ద ఫాస్టాగ్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి రెట్టింపు రుసుమును వసూలు చేస్తున్నారు. అదేసమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌గేట్ల నుంచి వసూలు చేస్తోన్న రుసుము రోజువారీగా సరాసరి రూ.100 కోట్ల మార్కును దాటింది. 
 
ఫాస్టాగ్‌ ద్వారా చేస్తోన్న చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. 'మార్చి 16 నాటికి 3 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీ చేశాము. వీటి ద్వారా మార్చి ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు నిత్యం సరాసరి వంద కోట్ల రూపాయలు వసూలు అవుతోంది' అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. 
 
టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యం లేకుండా, సులువుగా రుసుము చెల్లింపులు చేసేందుకు డిజిటల్‌ పద్ధతి ఎంతో దోహదం చేస్తోందని, దీంతో వాహనాలు వేచివుండే సమయం గణనీయంగా తగ్గిందన్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు టోల్‌ చెల్లింపుల్లో పారదర్శకత పెరిగేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చామన్నారు. 
 
ఇకపోతే, ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామన్నారు. వీటి స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. జీపీఎప్‌ ఆధారంగా.. వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుసువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.