శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (18:40 IST)

పాకిస్థాన్‌ను ఎవ్వరూ కాపాడలేరు.. రాజ్‌నాథ్ వార్నింగ్

పాకిస్థాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘాటు హెచ్చరికలు చేశారు. 1965, 1971లో చేసిన తప్పిదాలే మళ్లీ చేస్తే పాక్ తీవ్ర పరిణామాలు తప్పవని, ఏ శక్తీ పాక్‌ను కాపాడలేదని హెచ్చరించారు. సొంత గడ్డపైనే పాక్ తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘలనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఆదివారంనాడిక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన 'జన్ జాగరణ్ సభ'లో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, 'పాక్ ఇప్పటికే మనోస్థైర్యం కోల్పోయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వచ్చిన ఆ దేశ ప్రధాని స్వయంగా ఇండో-పాక్ సరిహద్దుల్లోకి వెళ్లొద్దని ప్రజలకు చెప్పారు. అది మంచిదే. ఇందుకు భిన్నంగా చేస్తే మాత్రం వాళ్లు తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లరు' అని రాజ్‌నాథ్ తీవ్రస్వరంతో అన్నారు.

పీఓకేలోని బలూచీలు, పస్టూన్లపై పాక్ మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్పడుతోందని, ఇదే కొనసాగితే మరిన్ని ముక్కలు కాకుండా పాక్‌ను ఎవరూ కాపాడలేరని రాజ్‌నాథ్ అన్నారు. 370 అధికరణ రద్దు పట్ల జమ్మూకశ్మీర్‌లోని నాలుగింట మూడొంతులకు పైగా ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

బీజేపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఎన్నడూ 370 అధికరణపై మెతకవైఖరితో లేదని, ఆ అధికరణను రద్దు చేయడం ద్వారా తమ పార్టీ నిజాయితీని, విశ్వసనీయతను చాటుకుందని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తే ఎంతమాత్రం సహించేది లేదన్నారు.

ఉగ్రవాదాన్ని ఆపేస్తేనే పాక్‌తో చర్చలనేవి ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో జమ్మూకశ్మీర్ అంతర్భాగమనీ, చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమే జరగాల్సి ఉంటుందని రాజ్‌నాథ్ విస్పష్టంగా పేర్కొన్నారు.