శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:13 IST)

ప్రతి పేదకు న్యాయం అందించడమే జడ్జి లక్ష్యం : రిటైర్డ్ జస్టిస్ ఎన్వీ రమణ

nvramana
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ.రమణ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో జరిగిన వీడ్కోలు సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. గురజాడ సూక్తులతో తన ప్రసంగించాన్ని ప్రారంభించిన ఆయన.. ప్రతి పేదకు న్యాయం అందించడమే జడ్జి లక్ష్యమని వెల్లడించారు. ఆ దిశగానే తన వంతు కృషి చేశానని వెల్లడించారు.
 
"సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్" అనే గురజాడ సూక్తిని ప్రస్తావిస్తూ ఈ సూక్తిని ఆచరణలో పెడితే కొద్దికాలంలోనే హింస, వివాదాలకు తావులేని సరికొత్త, స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలమని అన్నారు. నా ఊపిరి ఉన్నంతవరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతాను. "దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్" అనే గురజాడ సూక్తిని నిత్యం స్మరించుకుంటాను అని అన్నారు. 
 
"తన ప్రస్థానం కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామం నుంచి ప్రారంభమైందన్నారు. 12 యేళ్ల వయసులో నేను తొలిసారి కరెంటును చూశాను. ఓ సాధారణ కుటుంబంలో ఉండే అన్ని కష్టాలు అనుభవించాను. నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారికి రుణపడి ఉంటాను. 17 యేళ్ళ వయసులో విద్యార్థి సంఘం ప్రతినిధిగా వ్యవహరించాను. అంచలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు వరకు వచ్చాను. 
 
"సత్యమేవ జయతే" అనేది నేను నమ్మే సిద్ధాంతం. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అనేక అవాంతరాలు ఎదురైనా మౌనంగా భరిస్తూ నిలబడ్డాను. నాతోపాటు నా కుటుంబం కూడా ఆవేదనకు గురైంది. కర్తవ్య నిర్వహణలో నా వంతు పాత్ర పోషించానని భావిస్తున్నా. నేను సాధించిన ప్రతి గెలుపులో నా సహచర జడ్జిల భాగస్వామ్యం ఎనలేనిది. నా పదవీ కాలంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహకారం మర్చిపోలేను. సుప్రీంకోర్టులో సహకారం అందించిన సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
 
ఈ వృత్తిలో అనేక ఒడిదుడుకులు వస్తాయన్న విషయాన్ని న్యాయవాదులు గ్రహించాలి. న్యాయవాద వృత్తి కత్తిమీద సాము వంటిది. ప్రతి బాలును సిక్స్ కొట్టాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటారు. కానీ, ఏ బంతిని సిక్స్ కొట్టాలో బ్యాట్స్‌మెన్‍కే తెలుస్తుంది. అలాగే ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యం. నవతరం జడ్జిలపై గురుతర బాధ్యతర ఉంది. తదుపరి సీజేఐ యుయు లలిత్ ఇప్పటికే తన గొప్పతనం నిరూపించుకున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు" అని అన్నారు.