1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (19:58 IST)

ఢిల్లీ హింసలో వంద మంది రైతులు గల్లంతు, ఆరా తీస్తున్న కేంద్రం

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా, ఎర్రకోట వద్ద ఘర్షణ చెలరేగాయి. జాతీయ జెండా స్థానంలో మతపరమైన జెండాను ఎగురవేశారు. దీనిపై కేంద్రం కన్నెర్రజేసింది. 
 
అదేసమయంలో ఈ అల్లర్ల తర్వాత పంజాబ్‌కు చెందిన వంద మందికి పైగా రైతులు గల్లంతయ్యారని ఓ ఎన్జీవో వెల్లడించింది. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్‌ పరేడ్‌లో పాల్గొన్న వీరంతా అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పంజాబ్‌ మానవ హక్కుల సంస్థ పేర్కొంది. 
 
వీరిలో మోగా సమీపంలోని తతారివాలా గ్రామస్తులు 12 మంది ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్‌ పరేడ్‌ అనంతరం అదృశ్యమైన వారి పేర్లను సేకరించి రైతు సంఘాలు వారి ఆచూకీని కనుగొంటాయని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (రజేవల్‌) చీఫ్‌ బల్బీర్‌ సింగ్‌ రజేవల్‌ తెలిపారు. 
 
ఇక కిసాన్‌ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసాకాండకు సంబంధించి అరెస్టయిన వారికి పంజాబ్‌ మానవ హక్కుల సంస్థతో పాటు, ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా నిర్వహణ కమిటీ, ఖల్రా మిషన్‌ వంటి పలు సంస్థలు ఉచితంగా న్యాయసాయం అందించేందుకు ముందుకొచ్చాయి. 
 
ఎర్రకోట వద్ద చెలరేగిన హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ 18 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పశ్చిమ్‌ విహార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే, పలు రైతు సంఘాల నేతలకు లుకౌట్ నోటీసులు కూడా జారీచేశారు.