1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (09:57 IST)

చిలుక సాక్ష్యంతో మహిళ హత్యను చేధించిన పోలీసులు

చిలుక చెప్పిన సాక్ష్యంతో ఆగ్రాలో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళితే.. 2014లో ఆగ్రాలో నీలమ్ శర్మ అనే మహిళ హత్యకు గురైంది. నీలమ్ భర్త తన కుమారుడితో కలిసి ఓ పెళ్లి కోసం ఫిరోజాబాద్ వెళ్లారు. ఆ పెళ్లి నుంచి తిరిగొచ్చేసరికి నీలమ్ హత్యకు గురైంది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కత్తిపోట్ల కారణంగా ఆమె మరణించిందని పోస్టు మార్టం రిపోర్ట్ తెలిపింది. అయితే ఆధారాలు లేని ఈ కేసు పోలీసులకు చిక్కుముడిలా మారింది. అయితే, నీలమ్ శర్మ పెంపుడు చిలుక ఈ హత్య కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సాయపడింది. అశు వచ్చాడని చిలుక చెప్పడంతో ఆ వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీశారు. 
 
విచారణలో అశుతోష్ గోస్వామి నీలమ్ మేనల్లుడని.. నగల కోసం ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. కాగా, చిలుక సాక్ష్యాన్ని తొలుత కోర్టు అంగీకరించలేదు. అయితే, నీలమ్ శర్మను హత్య చేసే సమయంలో ఆమె పెంపుడు కుక్క అశుతోష్, రోనీలపై దాడి చేసింది. ఈ దాడిలో అశుతోష్ కు కుక్క కాట్లు పడ్డాయి. 
 
అనంతరం వారు కుక్కను కూడా కత్తితో పొడిచి చంపేశారు. ఈ కేసు 9 ఏళ్ల పాటు విచారణ జరగ్గా, 14 మంది సాక్షులను విచారించారు. తుదకు చిలుక సాక్ష్యమే నిజమైంది. అనంతరం ఒంటరిగా ఉన్న మహిళను నగల కోసం చంపారంటూ వారికి జీవితఖైదు విధించింది. 
 
కరోనా సమయంలో నీలమ్ భర్త విజయ్ శర్మ మరణించినా, వారి కుమార్తెలు మాత్రం తల్లి హత్య కేసులో న్యాయం కోసం పట్టువదలకుండా కేసును గెలిచారు. హంతకుడికి తగిన శిక్ష పడేంత వరకు వెనక్కి తగ్గలేదు.