1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (17:07 IST)

కరోనా కష్టాలు... కరువు పనులకు పీహెచ్‌డీ పట్టభద్రులు... ఎక్కడ?

కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. అనేక మంది జీవితాలు చిన్నాభిన్నమైపోయాయి. ఉన్నత విద్యావంతులు సైతం కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఉపాధ్యాయులతో పాటు.. లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. అసలే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న దేశంలో కరోనా సంక్షోభం నిరుద్యోగ శాతాన్ని మరింతగా పెంచింది. 
 
కరోనా కారణంగా నష్టాలపాలైన అనేక సంస్థలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలు వంటివి చేపట్టకపోవడం వంటి చర్యలతో కోలుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో అనేకమంది పట్టభద్రులు, పీజీ విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
 
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తితో కుదేలవుతున్న కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు రెండు వారాల లాక్డౌన్ కూడా అమల్లోవుంది. అయితే, కరోనా దెబ్బకు పీహెచ్‌డీ చేసినవాళ్లు కూడా ఉపాధి కోసం చిన్నాచితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. 
 
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో భాగంగా కరవు పనుల కోసం వారు తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో నమోదైన కరవు పనుల కార్మికుల జాబితాలో పీహెచ్‌‌డీ పట్టాదారుల పేర్లు ఉండడం పరిస్థితికి అద్దంపడుతోంది.
 
హనగల్ తాలూకాలో ఓ జాబితాను పరిశీలించగా... 8 మంది పట్టభద్రులు, 12 మంది పీజీ, నలుగురు పీహెచ్‌డీ పట్టాలు అందుకున్న వారు ఉన్నారు. కరోనా తొలి తాకిడితో బాగా నష్టం జరగ్గా, ఇప్పుడు సెకండ్ వేవ్ మరింతగా ప్రభావం చూపుతోంది. వలస వెళ్లిన వాళ్లందరూ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. వారిలో అత్యధికులకు ఈ ఊపాధి హామీ పథకమే కడుపు నింపుతోంది.
 
హవేరీ జిల్లాలో గతేడాది లాక్డౌన్ అనంతరం 3,649 మంది తమ పేర్లు నమోదు చేయించుకోగా, ఈ ఏడాది అది 4,842కి పెరిగింది. వారిలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, బీఎస్సీ, బీఈడీ విద్యార్థులు, పీహెచ్‌డీ పట్టా అందుకున్నవారు కూడా ఉండటం గమనార్హం.