గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (16:23 IST)

చెన్నై - మైసూర్ మధ్య వందే భారత్ రైలు.. ప్రత్యేకతలు ఇవే....

vande bharat train
దక్షిణ భారతదేశంలో వందే భారత్ సేవలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలు సేవలను శుక్రవారం బెంగుళూరులో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు చెన్నై - మైసూరుల మధ్య నడుస్తుంది. బెంగుళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషను నుంచి ఈ సేవలు మొదలయ్యాయి. 
 
దేశంలో ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందిన చెన్నై, టెక్ సిటీగా పేరొందిన బెంగుళూరు, పర్యాటక నగరంగా ఉన్న మైసూరును అనుసంధానం చేస్తూ ఈ రైలు సేవలను ప్రారంభించారు. దేశంలో ఇది ఐదో వందే భారత్ రైలు. 
 
దక్షిణ భారతదేశంలో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు. ఆ తర్వాత భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును సైతం ప్రధాని ప్రారంభించారు. కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళే ప్రయాణికుల కోసం ఈ రైలు ఎంతో అనుకూలంగా ఉంటుంది. 
 
ఈ వందే భారత్ రైలు ప్రత్యేకతలను పరిశీలిస్తే, 
 
చెన్నై నుంచి మైసూరు వెళ్లడానికి వందే భారత్ రైలులో చైర్ కార్ ప్రయాణ చార్జీ రూ.1200గాను, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ రూ.2295గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలో మైసూరు నుంచి చెన్నైకు అయితే ఇవే చార్జీల్లో పది శాతం అధికంగా ఉంటాయి. 
 
ఈ రెండు ప్రాంతాల మధ్య 540 కిలోమీటర్లు ఉండగా, ఈ దూరాన్ని ఆరున్నర గంటల వ్యవధిలో చేరుకుంటుంది. మార్గమధ్యంలో కాట్పాడి, బెంగుళూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 
 
ఈ రైలు రోజువారి సేవలు శనివారం నుంచి ప్రారంభమై, వారంలో ఆరు రోజుల పాటు మాత్రమే నడుస్తాయి. చెన్నై నుంచి బెంగుళూరుకు మాత్రం కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. 
 
అన్ని కోచ్‌లకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. సౌకర్యవంతమైన సీట్లు, వైఫై సదుపాయాలు ఉంటాయి.