శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (16:49 IST)

బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్

advani - modi
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ తన 96వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లు ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి విషెస్ చెప్పారు. ఆ తర్వాత అద్వానీతో కూర్చుని పలు అంశాలపై మోడీ చర్చించారు. ఈ సందర్భంగా వారు తీసిన ఫోటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
1927 నవంబరు 8వతేదీన పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో జన్మించిన అద్వానీ.. దేశ విభజన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రచారక్‌గా పని చేసి ఆ సంస్థలో అంచలంచెలుగా ఎదిగారు. తదనంతరం జన సంఘ్‌లో చేరిన అద్వానీ జన సంఘ్‌ను భారతీయ జనతా పార్టీగా మార్చి కీలక భూమిక పోషించారు. 
 
1990 దశకంలో దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీ అద్వానీ చేపట్టిన రథయాత్రతో ఏకంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ప్రధానిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధానిగా ఎల్కే. అద్వానీలు బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయి జీవించివున్నంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహించిన అద్వానీ.. మోడీ సారథ్యంలోని బీజేపీ నేతృత్వంలో పూర్తిగా తెరమరుగై ఇన ఇంటికే పరిమితమయ్యారు.