1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (14:16 IST)

ప్రధానమంత్రి మోడీ తల్లికి అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు

modi heeraben
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ యేడాది జూన్ నెలలో వందో యేటలోకి అడుగుపెట్టిన హీరా బెన్... గత 1923 జూన్ 13వ తేదీన జన్మించారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ గాంధీ నగర్‌లోని తన సోదరుడు పంకజ్ మోడీ నివాసానికి ప్రధాని మోడీ వెళ్లి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వందో పుట్టిన రోజు సందర్భంగా తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్టు ప్రధాని మోడీ ఓ ట్వీట్ కూడా చేశారు. 
 
ఆ సమయంలో తన తల్లితో అర గంట పాటు ముచ్చటించి ఆమెతో కలిసివున్నారు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు లోనుకావడంతో ప్రధాని మోడీ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ తల్లిని చూసేందుకు ఆయన గుజరాత్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఏ క్షణంలో గుజరాత్‌కు వచ్చినా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు  సిద్ధంగా ఉన్నారు. 
 
మరోవైపు, మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోడీ సోదరుడు ప్రహ్లాద్ దామోదరన్ దాస్ మోడీ కారు బాగా దెబ్బతింది. ఆ సమయంలో ప్రహ్లాద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు బెంజ్ కారులో ఉన్నారు. ఈ కారు మైసూరు నుంచి బందీపూర్ వైవు వెళుతుండగా, కడకోల సమీపంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రహ్లాద్ మోడీ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.