1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (10:54 IST)

నేడు గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోడీ - రూ.9600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)తో పాటు ఎరువుల తయారీ కర్మాగారం, మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే రూ.9600 కోట్ల విలువ చేసే వివిధ రకాలైన జాతీయ ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. 
 
గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్ ఆస్పత్రిని నెలకొల్పారు. ఇది ఒక్క యూపీలోని పూర్వాంచల్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న బీహార్‌ రాష్ట్రం, నేపాల్ దేశ పౌరులకు కూడా సేవలు అందించనుంది. 2016 జూలై 22వ తేదీన ఈ ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రూ.1000 కోట్లకు పైగా నిధులతో నిర్మించారు. అలాగే గోరఖ్‌పూర్‌లో నిర్మించిన ఎరువుల తయారీ కర్మాగారాన్ని సైతం ప్రారంభించనున్నారు. 
 
ఈ రెండింటిని ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు. అయితే, కొత్తగా తెరవనున్న ఎరువుల కర్మాగారం గత 30 యేళ్లుగా మూతపడివుంది. దీన్ని రూ.8600 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. ఈ ప్లాంట్‌లో ఏటా 12.7 ఎల్ఎంటీ దేశీయ వేపపూతతో కూడిన యూరియాను ఉత్పత్తి చేస్తారు. అలాగే, గోరఖ్‌పూర్‌లో ఐసీఎంఆర్ ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం కొత్త భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు.