శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 జులై 2022 (14:48 IST)

అఖిలపక్ష సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రధానమంత్రి

pmmodi
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఆదివారం అధికార పార్టీ అఖిలపక్ష సమావేశానని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఇందులో ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పీయూష్‌ గోయల్‌లు పాల్గొన్నారు విపక్షాల నుంచి ఆయా పార్టీల సీనియర్‌ సభ్యులు హాజరయ్యారు. 
 
పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించే అంశాల అజెండాను ముందుంచి.. అన్ని పార్టీల్లో ఏకాభిప్రాయం తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ భేటీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని ప్రహ్లాద్‌ జోషి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటిలాగే హాజరు కాలేదంటూ కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది.
 
ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ తరపున మల్లికార్జున ఖర్గే, అధీర్‌ రంజన్‌ చౌధరి, జయరాం రమేశ్‌లు పాల్గొనగా డీఎంకే తరపున టీఆర్‌ బాలు, తిరుచ్చి శివ, టీఎంసీ నుంచి సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌లు హాజరుకాగా ఎన్‌సీపీ నుంచి శరద్‌ పవార్‌ పాల్గొన్నారు. 
 
బీజేడీ నుంచి పినాకి మిశ్రా, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డిలు పాల్గొనగా తెరాస నుంచి కేశవరావు, నామా నాగేశ్వర్‌ రావులు అఖిలపక్ష భేటీకి హాజరయ్యారు. ఆర్‌జేడీ నుంచి ఏడీ సింగ్‌, శివసేన నుంచి సంజయ్‌ రౌత్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. దేశంలో ఆర్థికవ్యవస్థ, నిరుద్యోగం, అగ్నిపథ్‌ వంటి విషయాలపై ప్రధానంగా చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.