1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (08:25 IST)

నేను తల్లిని కావాలనుకుంటున్నాను... నా భర్తకు పెరోల్ మంజూరు చేయండి..

court
నేను తల్లిని కావాలనుకుంటున్నాను.. అందువల్ల నా భర్తకు పెరోల్ మంజూరు చేయాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై రాజస్థాన్ కోర్టు సానుకూలంగా స్పందించింది. అత్యాచారం కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న ముద్దాయికి భార్యను తల్లిని చేసేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాహుల్ (25) అనే వ్యక్తి ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో అతనికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ముద్దాయిని జైలుకు తరలించారు. 
 
ఈ క్రమంలో తాను తల్లిని కావాలనుకుంటున్నానని, తన భర్తకు పెరోల్ మంజూరు చేయాలని రాహుల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సందీప్ మెహతా, సమీర్ జైన్‌లతో కూడిన ధర్మాసనం 15 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది. భర్త లేకుండా, భర్త నుంచి పిల్లలు కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆమె జీవించకూడదని కోర్టు స్పష్టంచేసింది. 
 
ఆమె తన వంశ పరిరక్షణ కోసమే ఈ పిటిషన్‌ను దాఖలు చేసిందని, ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తే ఆమె హక్కులను కాలరాసినట్టే అవుతుందని అభిప్రాయపడిన ధర్మాసనం... ముద్దాయికి 15 రోజుల పెరోల్ మంజూరుచేసింది. రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల చొప్పున రెండు జామీను బాండ్లు సమర్పించి పెరోల్ పొందొచ్చని సూచించింది.