1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2022 (10:48 IST)

ఆత్మహత్య చేసుకున్న యువతి.. ప్రియుడితో బలవంతగా పురుగుల మందు తాగించారు.. ఎక్కడ?

woman
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట మృతిలో ఉన్న రహస్యాన్ని పోలీసులు ఛేదించారు. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో యువతి తరపు బంధువులు తమ బిడ్డ మృతికి ఆమె ప్రియుడే కారణంగా భావించి, అతనితో బలవంతంగా పురుగుల మందు తాగించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. రాష్ట్రంలోని విజయపుర జిల్లా తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన మల్లికార్జున జమఖండి (20), కల్లవటగికి చెందిన గాయత్రి (18)లు ప్రేమించుకున్నారు. విజయపురలోని కళాశాలకు బస్సులో వెళ్లి - వచ్చే సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది.

దీంతో గత నెల 23వ తేదీన మల్లికార్జున ఆ యువతి ఇంటికి వెళ్లాడు. పొలంలో ఉన్న ఇంటి పక్కనే ఓ గదిలో ఆ ఇద్దరూ మాట్లాడుకోవడం గుర్తించిన యువతి తండ్రి గురప్ప వేగంగా.. ఆ గదికి తాళం వేశారు. భయపడిపోయిన ఆ యువతి అక్కడే ఉన్న పురుగుల మందును తాగేసింది. విష ప్రభావంతో అక్కడికక్కడే మరణించింది.

కొద్దిసేపటి తర్వాత యువతి తండ్రి గురప్ప, బంధువులు అజిత్‌, మల్లప్ప తాళంతీసి ఆ గదిలోకి వెళ్లారు. యువతి మరణంపై ఊగిపోయారు.

యువకుడిని స్తంభానికి కట్టి బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆ యువకుడు కూడా చనిపోయిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వేర్వేరు సంచుల్లో కట్టి సెప్టెంబరు 24న కొర్తికొల్లార వంతెన వద్ద కృష్ణా నదిలో పడవేశారు. ఈ నెల 5వ తేదీన గాయత్రి అపహరణకు గురైనట్లు తికోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువకుడు కనిపించకుండా పోయినట్లు కుటుంబసభ్యులు మరో కేసు నమోదు చేశారు. అక్టోబరు 10న బీళగి వద్ద గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించింది. ధరించిన టీషర్ట్‌ ఆధారంగా యువకుడి ఆధారాలు సేకరించారు.

తర్వాత దర్యాప్తులో ప్రేమికుల్లో ఒకరు ఆత్మహత్య.. మరొకరు హత్యకు గురైనట్లు తేలింది. ఇది పరువు హత్య అనే అనుమానాలూ జోరందుకున్నాయి. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసి, కస్టడీకి తరలించారు.